గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (08:56 IST)

కరోనా మహమ్మారి తగ్గిపోతుంది కానీ... సామాజిక దూరం పాటించాలి...

ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ మహమ్మారి అనుకున్న సమయం కంటే ముందుగానే తగ్గిపోతుందనీ కానీ, ఇందుకోసం ప్రతి ఒక్కరూ సామాజికదూరం (సోషల్ డిస్టెన్స్) పాటించాలని ప్రఖ్యాత జీవ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ లెవిట్ అభిప్రాయపడ్డారు. ఈయన గత 2013లో రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ గురించి ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వ్యాప్తి నెమ్మదిస్తుందని, అది దశలవారీగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయన్నారు. చైనా తరహాలోనే అమెరికా కూడా త్వరలోనే కరోనా నుంచి విముక్తి సాధిస్తుందని, ప్రస్తుత శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయం కంటే ఇది ముందే జరుగుతుందన్న ఆశాభావాన్ని లెవిట్ వ్యక్తం చేశారు. 
 
ఈ యేడాది జనవరి నుంచి, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులను నిశితంగా అధ్యయనం చేస్తున్న లెవిట్, భయాందోళనలను అధిగమించి, సామాజిక దూరం పాటిస్తే, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సులువేనని అన్నారు.
 
కాగా, వైరస్‌పై లెవిట్ వేసిన అంచనాలు ఎన్నో నిజమయ్యాయి. చైనాలో సుమారు 80 వేల కేసులు నమోదవుతాయని, 3,250 మరణాలు సంభవిస్తాయని లెవిట్‌ ఫిబ్రవరిలో వేసిన అంచనాలు వాస్తవ గణాంకాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. చైనాలో 80,298 కేసులు, 3245 మరణాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
 
78 దేశాల నుంచి నిత్యమూ కొత్తగా నమోదవుతున్న కేసులను విశ్లేషిస్తున్నామని, ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి వేగం కొంత తగ్గిందని ఆయన అన్నారు. మొత్తం కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోలేదని, కొత్తగా నమోదయ్యే కేసుల్లో తగ్గుదలను పరిశీలిస్తున్నామన్నారు. సంఖ్యా పరంగా కనిపిస్తున్న కేసులు, ఆందోళనకరంగానే ఉన్నా, వైరస్‌ వ్యాప్తి బలహీనపడుతున్నదనేందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని లెవిట్ విశ్లేషించారు. 
 
ఈ వైరస్ అడ్డుకట్టకు ఏకైక మార్గం, సూత్రం... సామాజిక దూరం పాటించడమేనని చెప్పారు. అదేసమయంలో వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడం అత్యంత కీలకమన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన సెలబ్రిటీలపై ఫోకస్‌ చేయడాన్ని మీడియా తక్షణం మానుకోవాలని, మీడియా కారణంగానే ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.