1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 మే 2025 (09:38 IST)

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

bharat bangla
అపుడపుడూ తోక జాడిస్తున్న బంగ్లాదేశ్‌కు కూడా భారత్ కర్రుకాల్చివాతపెట్టింది. ఇటీవలికాలంలో భారత్ శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనాలకు సన్నిహితంగా మెలుగుతోంది. అంతటితో మిన్నకుంటే ఫర్లేదు.. భారత్‌పై తమకుండే విద్వేషాన్ని వెళ్లగక్కుతోంది. దీంతో పాకిస్థాన్‌, టర్కీలతో పాటు బంగ్లాదేశ్‌పై కూడా ఆంక్షలు విధించింది. ఇక నుంచి బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విభాగం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
దీనిప్రకారం ఇకపై బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తులను కోల్‌కతా, నవా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. అలాగే, ఈశాన్యంలోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి కూడా పలు వస్తువుల దిగుమతిని నిషేధించింది. వీటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బోనేటెడ్ పానీయాలు ఉన్నాయి. 
 
ఈ వస్తువులను మేఘాలయ, అస్సోం, త్రిపుర, మిజోరం, వెస్ట్ బంగాల్‌లోని పుల్‌బారి, చంగ్రబంధఁలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, చెక్ పోస్టుల ద్వారా భారత్‌లోకి ఇక నుంచి అనుమతించరు. అయితే, ఈ ఆంక్షలు భారత్ మీదుగా భూటాన్, నేపాల్‌లకు రవాణా చేసే వస్తువులకు వర్తించవు. కేవలం భారత్‌లోకి దిగమతి అయ్యే వస్తువులకు మాత్రమే వర్తిస్తాయి. 
 
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్, బంగ్లాదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంతకుముందు యూనస్ చైనా పర్యటనలో ఉన్న సమయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగాళాఖాతానికి బంగ్లాదేశ్ రక్షకుడని, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయంటూ కామెంట్స్  చేశారు. ఈ వ్యాఖ్యల పర్యావసానంగా బంగ్లాదేశ్‌కు ఇస్తున్న ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యాన్ని భారత్ రద్దు చేస్తూ షాకిచ్చింది.