శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (09:09 IST)

ఫింగర్ 4 పాయింట్‌ను స్వాధీనం చేసుకున్న భారత్.. బిత్తరపోయిన చైనా

భారత్, చైనా సరిహద్దుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీంతో సరిహద్దుల్లో పరిస్థితితి నివురు గప్పిన నిప్పులా వుంది. గురువారం రోజంతా ఎలాంటి ఘర్షణలూ జరగకపోయినప్పటికీ వాతావరణం మాత్రం గంభీరంగానే వుంది. 
 
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే 50 వేల మందికిపై సైనికులను భారత్ సరిహద్దులకు తరలించింది. దీంతో భారత్ కూడా అప్రమత్తమై భారీ సంఖ్యలో సైనిక బలగాలతో పాటు.. ఆయుధ సామాగ్రిని కూడా తరలిస్తోంది. 
 
ఈ క్రమంలో తాజాగా, ఫింగర్‌-4 వద్ద ఉన్న కొండలపై భారత దళాలు పాగా వేశాయి. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో ఫింగర్‌-4 వద్ద గతంలో ఆక్రమించిన కొన్ని మిట్టలను చైనా ఖాళీ చేసి ఉత్తరాన ఎక్కువగా మోహరించింది. దీంతో భారత బలగాలు ఆలస్యం చేయకుండా వీటిని స్వాధీనపరుచుకున్నాయి. 
 
మరోవైపు, కీలకమైన రెజాంగ్‌ లా సమీపానికి రెండు రోజుల కిందట కత్తులు, బరిసెలు, ఈటెలు, గ్వువాండో (చైనా మార్షల్‌ ఆర్ట్స్‌లో వాడే కత్తులు)లతో వచ్చిన దళం ఇంకా అక్కడే తిష్టవేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇరుదేశాల కమాండర్ల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 
 
ఇదిలావుండగా, లడఖ్‌లో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ.. చైనాకు శత్రువైన జపాన్‌తో భారత్‌ చేయికలిపింది. ఓ కీలకమైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే, శుక్రవారం మాస్కో వేదికగా భారత్ - చైనా విదేశాంగ మంత్రుల అత్యున్నత స్థాయి సమావేశం జరుగనుంది.