1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (17:15 IST)

హజ్ యాత్ర : కాలి నడకన ఇంగ్లండ్ నుంచి మక్కాకు...

adam mahmad
ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్రకు ఓ ఇరాకీ కుర్దిష్ సంతతికి చెందిన బ్రిటీష్ వ్యక్తి పెద్ద సాహసమే చేశారు. ఆయన హజ్ యాత్రను చేపట్టి ఇంగ్లండ్ నుంచి మక్కాకు ఏకంగా 6500 కిలోమీటర్ల కాలి నడకన తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఈ వ్యక్తి పేరు ఆడమ్ మహ్మద్. వయస్సు 52 యేళ్లు. 
 
ఇంగ్లండ్‌లోని ఓల్వర్ హ్యాంప్టన్ నుంచి బయలుదేరిన ఈయన నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్ మీదుగా సౌదీ అరేబియాకు చేరాడు. ఆయన నడక ఏకంగా 10 నెలల 25 రోజుల పాటు సాగింది. మొత్తం 6500 కిలోమీటర్లు ప్రయాణించాడు. 2021 ఆగస్టు 1న బ్రిటన్‌లో బయలుదేరిన ఆడమ్ మహ్మద్ గత నెలలో సౌదీకి చేరుకున్నాడు. 
 
ఈయన రోజుకు సగటున 17.8 కిలోమీటర్ల మేరకు నడిచినట్టు అల్ జజీరా టీవీ పేర్కొంది. ఈ వ్యక్తి తన వ్యక్తిగత సామాగ్రితో పాటు తోపుడు బండితో చేరుకున్నాడు. ఈ తోపుడు బండికి మతపరమైన ప్రబోధాలను వినిపించేందుకు లౌడ్ స్పీకర్లు కూడా అమర్చాడు. శాంతి సమానత్వ సందేశాన్ని చేరవేసే లక్ష్యంగా పాదయాత్రను చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 
 
అయితే, ఈ సాహసం డబ్బు కోసం చేయలేదని వర్ణం, జాతి, మతంతో నిమిత్తం లేకుండా మానవాళి అంతా ఒక్కటేననే సందేశం ఇచ్చేందుకే తాను ఇలా చేస్తున్నానని చెప్పాడు. 
 
కాగా, తన గమ్యస్థానానికి చేరుకున్న ఆడమ్‌కు సౌదీ అరేబియా మీడియా వ్యవహారాల శాఖామంత్రి మజిద్ బిన్ అబ్దుల్లా అల్ కుశబి స్వాగతం పలికి, హజి పర్మిట్ లాంఛనాలను పూర్తి చేయడంలో సహకరించారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత సౌదీ ప్రభుత్వం హజ్ యాత్రకు అనుమతించిన విషయంతెల్సిందే.