1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (12:16 IST)

కిమ్ రాజ్యపాలనలో కిలో అరటిపండ్లు రూ.3 వేలు.. కాఫీ ప్యాకెట్ రూ.7 వేలు

ఉత్తర కొరియా దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆ దేశ ప్రజలు తినేందుకు తిండిలేక తల్లడిల్లిపోతున్నారు. పైగా, ఆ దేశంలో లభిస్తున్న కొన్ని వస్తువుల ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. దీనికి నిదర్శనమే ఉత్తర కొరియా దేశంలో కిలో అరటి పండ్లు 7 వేల రూపాయల ధర పలుకుతోంది. అలాగే, ఒక కాఫీ ప్యాకెట్ ధర రూ.7 వేలుగా అమ్ముతున్నారు. ఇలాంటి సంఘటనలు ఆ దేశంలో నెలకొనివున్న ఆహార కొరతకు అద్దంపడుతున్నాయి. 
 
దేశంలో ఆహార కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటూ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారు కూడా. దీంతో ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా నిత్యావసర సరుకుల కొరత ఉంటే ధరలు అమాంతం పెరుగుతాయి. సామాన్యుడికి అందనంత దూరంలో ఆహార పదార్థాల ధరలు ఉంటాయి. 
 
ఇప్పుడు ఉత్తర కొరియాలోనూ అదే జరుగుతోంది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఓ చిన్న బ్లాక్ టీ ప్యాకెట్ ధర 70 డాలర్లు (5,167రూపాయలు). ఇక కాఫీ ప్యాకెట్ ధర అయితే వెయ్యి డాలర్లకు పైగానే(7,381 రూపాయలు) ఉంది. ఇక ఒక కిలో అరటిపండ్ల ధర 45 డాలర్లుగా ఉంది. అంటే ఇక్కడ 3300 రూపాయలన్నమాట. మహా అయితే కిలోకు ఒక ఆరేడు అరటిపండ్లు మాత్రమే వస్తాయి. 
 
ఈ స్థాయిలో ఉత్తర కొరియాలో ఆహార కొరత ఏర్పడటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆ దేశంపై ఉన్న ఆంక్షలు. పలు దేశాలు ఆ దేశం నుంచి ఎగుమతి దిగుమతులపై ఆంక్షలు విధించడమేకాకుండా, స్వయంగా ఉత్తర కొరియా కూడా కరోనా కట్టడి నిమిత్తమై స్వీయ ఆంక్షలను విధించుకుంది. దీనితోపాటు ఆ దేశంలో ఇటీవల తీవ్రంగా వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల భారీ స్థాయిలో పంట నాశనమయింది. ఫలితంగా ఆ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటోంది. 
 
ఈ ఏడాది మొత్తం మీద ఉత్తర కొరియా 13 లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేస్తోంది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం కూడా తన అంచనాను వెల్లడించింది. దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఉత్తర కొరియా ఎదుర్కొంటోందని స్పష్టం చేసింది. పరిస్థితులను గమనించిన కిమ్ జాంగ్ ఉన్ ఆహార కొరతను ఎదుర్కొనేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆహారోత్పత్తిని పెంచేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.