బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (12:48 IST)

డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని గుర్తించిన ఎఫ్.బి.ఐ

accused identified
అమెరికా అధ్యక్ష పీఠానికి జరుగనున్న ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన దుండగుడిని ఎఫ్.బి.ఐ అధికారులు గుర్తించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన వ్యక్తిగా తెలిపింది. ప్రభుత్వ ఓటింగ్‌ రికార్డుల ప్రకారం.. అతడు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నాడు. కానీ, అతడు 2021 సంవత్సరంలో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్‌ టర్న్‌ఔట్‌ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం క్రూక్స్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానీయడంలేదు.
 
దుండగుడు క్రూక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం అనుమానితుడిగా పేర్కొంటూ అతడి ఫొటోలను ముందే ప్రసారం చేశాయి. మరోవైపు కాల్పులకు ముందు అతడు రికార్డు చేసినదిగా పేర్కొంటున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది. అందులో 'రిపబ్లికన్‌ పార్టీని, ట్రంప్‌ను నేను ద్వేషిస్తున్నా'నని అతడు చెబుతున్నట్లుగా ఉంది. 
 
ట్రంప్‌ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఓ తయారీ కేంద్రం పైకప్పున మాటువేసి ఈ కాల్పులకు తెగబడ్డట్లు స్పష్టమవుతోంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతణ్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. దీనికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారిని కోరింది.