శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

శ్రీలంక అందాల పోటీల్లో అనూహ్య పరిణామం... రసాభాసగా మార్చిన 'మిసెస్ వరల్డ్'

మిసెస్ శ్రీలంక పోటీల ఫైనల్స్ వేడుకగా జరుగుతున్న వేళ ప్రస్తుతం 'మిసెస్ వరల్డ్'గా ఉన్న '2019 మిసెస్ శ్రీలంక' అయిన కరోలిన్ ఆ పోటీలను రసాభాసగా మార్చేసింది. ఈ పోటీల్లో మిసెస్ శ్రీలంకగా పుష్పిక డి సిల్వ విజయం సాధించింది. ఆమెకు కరోలిన్ కిరీటాన్ని తొడిగింది. దీంతో వేదిక మొత్తం కరళాతాల ధ్వనులతో ప్రతిధ్వనించింది. అంతలోనే కరోలిన్ జోక్యం చేసుకోవడంతో గందరగోళం ఏర్పడింది.
 
అందాల పోటీల నిబంధనల మేరకు విడాకుల తీసుకున్న మహిళలకు కిరీటాన్ని స్వీకరించే అర్హత లేదని పేర్కొంది. ‘‘మిసెస్‌ శ్రీలంక’’ పోటీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన పుష్పికా డి సిల్వా తలపై ఉంచిన కిరీటాన్ని మిసెస్ వరల్డ్ , మాజీ మిసెస్ శ్రీలంక కరోలిన్ జ్యూరీ… స్టేజీపైననే లాగేసారు. దీంతో పుష్పికా షాక్ అయ్యింది. ఆ షాక్ నుంచి ఆమె కోలుకునేలోపే కరోలిన్ ‘‘మిసెస్ శ్రీలంక’’ కిరీటాన్ని తలపై పెట్టుకునే అర్హత పుష్పికాకు లేదు.. పుష్పిక భర్త నుంచి విడాకులు తీసుకుంది మరి ఆమెకు మిసెస్ శ్రీలంక కిరీటాన్ని ధరించే అర్హత ఎలా ఉంటుంది? అంటూ కరోలిన్ మండిపడింది. ఈ చర్యకు జ్యూరీలు సహా అందరూ ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
అంతేకాదు, కిరీటాన్ని బలవంతంగా తీసే క్రమంలో పుష్పికకు గాయాలు కూడా అయ్యాయి. అయినా అదేమీ పట్టించుకోని కరోలిన్ తీరు చూసి వేడుకలకు హాజరైన వారు విస్తుపోయారు. మరోవైపు, ఈ పరిణామంతో తీవ్ర నిరాశకు గురైన పుష్పిక వేదిక వెనకవైపు నుంచి వెళ్లిపోయారు.
 
ఈ పరిణామాలపై పుష్పిక ఆ తర్వాత ఫేస్‌‌బుక్ ద్వారా స్పందించారు. తాను విడాకులు తీసుకోలేదని, తాను కనుక విడాకులు తీసుకుని ఉంటే ఆ పత్రాలు సమర్పించాలని సవాలు విసిరారు. తనకు జరిగిన అవమానం, అన్యాయంపై చట్టపరంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇతరుల కిరీటాన్ని దోచుకునే మహిళ నిజమైన రాణి కాబోదని ఆ పోస్టులో డి సిల్వ మండిపడ్డారు.
 
మరోవైపు, ఈ వ్యవహారంపై అందాల పోటీల నిర్వాహకులు స్పందించారు. ఆమె విడాకులు తీసుకోలేదని చెబుతూ పుష్పికకు మళ్లీ కిరీటాన్ని అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలోని ఒంటరి తల్లులందరికీ ఈ కిరీటాన్ని అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. కాగా, కరోలిన్ వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని, మిసెస్ వరల్డ్ సంస్థ ఇప్పటికే ఆమెపై దర్యాప్తు ప్రారంభించిందని మిసెస్ శ్రీలంక వరల్డ్ డైరెక్టర్ పేర్కొన్నారు.