గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (12:25 IST)

అత్యాచార బాధితురాలికి నోబెల్ ప్రైజ్...

గతంలో అత్యాచారానికిగురైన ఓ బాధితురాలికి ఇపుడు నోబెల్ శాంతి బహుమతి వరించింది. లైంగిక హింసపై జరుపుతున్న పోరాటానికి, లైంగిక హింస బాధితులకు అందించిన తోడ్పాటుకు గుర్తింపుగా ఈ యేడాది ఇద్దరికి నోబెల్ శాంతి పురస్కారం వరించిన విషయం తెల్సిందే. వీరిలో ఒకరు అత్యాచార బాధితురాలు కావడం గమనార్హం.
 
కాంగోకు చెందిన గైనకాలజిస్టు డాక్టర్‌ డెనిస్‌ ముక్వెగినీ, ఇరాక్‌కు చెందిన నాదియా మురాద్‌ అనే అత్యాచార బాధితురాలిని ఈ అవార్డుకు స్వీడిష్‌ రాయల్‌ అకాడెమీ ఎంపికచేసింది. వీరిరువురికీ 10 లక్షల డాలర్లు లభిస్తాయి. మొత్తం 311 నామినేషన్లలో నుంచి వీరిద్దరినీ ఎంపిక చేశారు. వేల మంది రేప్‌ బాధితులకు చికిత్స చేసినందుకుగాను డాక్టర్‌ ముక్వెగిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈయన కాంగో దేశస్థుడు కావడం గమనార్హం. 
 
ఇకపోతే, ఇరాక్‌కు చెందిన నాదియా మురాద్‌ (25) ఇరాక్‌ ఉత్తరప్రాంతంలో కుర్దులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఉన్న యాజిదీ అనే తెగకు చెందిన మహిళ. ఆమె కళ్ల ముందే ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆమె కన్నవారిని బంధువులను కడతేర్చి, ఊరినే స్మశానంగా మార్చి, ఆమెతో పాటు మరో మూడువేల మందిని లైంగిక బానిసలుగా మార్చేశారు. వారి చెర నుంచి తప్పించుకుని ప్రపంచానికి తన బాధను విడమర్చి చెప్పిందామె. 
 
ఐక్యరాజ్యసమితి సైతం చలించిపోయి, ఆమెను సుహృద్భావ రాయబారిగా నియమించింది. లైంగిక దాడులు, హింస కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో అత్యున్నత పురస్కారం ఆ అంశాన్ని స్పృశించడం విశేషం. పెరిగిపోతున్న అత్యాచారాలను నిరసిస్తూ సామాజిక దుష్కృత్యాన్ని అంతమొందించేందుకు జీవితాన్ని ధారవోస్తున్న వారికి నోబెల్‌ ప్రకటించడం విశేషాంశమని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.