మా జోలికి వస్తే యుద్ధ విమానాల కిందే సమాధి చేస్తాం ... భారత్కు పాక్ హెచ్చరిక
తమ జోలికి ఎవరైనా వస్తే యుద్ధ విమానాల కిందే సమాధి చేస్తామని భారత్కు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా అసిఫ్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటంలో పాకిస్థాన్ లేకుండా చేస్తామంటూ భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు హెచ్చరించిన నేపథ్యంలో పాక్ రక్షణమంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచే పాకిస్థాను తుడిచిపెడతామని జనరల్ ద్వివేది వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్గా ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వస్తున్నవి రెచ్చగొట్టే వ్యాఖ్యలని, 'ఆపరేషన్ సిందూర్' తర్వాత దెబ్బతిన్న తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికే భారత నేతలు విఫలయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
'గతంలో 0-6 స్కోరుతో ఓటమి చవిచూశారు. మళ్లీ ప్రయత్నిస్తే, ఈసారి స్కోరు అంతకంటే ఘోరంగా ఉంటుంది' అని ఆసిఫ్ అన్నారు. అయితే, ఈ '0-6' స్కోరు ఏమిటనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ప్రచారానికి ఇది సంకేతంగా భావిస్తున్నారు.
మరోవైపు, దేశ సమగ్రతను కాపాడేందుకు అవసరమైతే ఏ సరిహద్దునైనా దాటడానికి వెనుకాడబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సర్ క్రీక్ వద్ద పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా చరిత్ర, భూగోళం రెండింటినీ మార్చేసేంత గట్టి సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు.