1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 22 మే 2019 (19:14 IST)

పిగ్ ఫెస్టివల్: పందులను అందంగా అలంకరించి ఆపై వండుకుని తినేస్తారు..

ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రకాలైన ఫెస్టివల్స్‌ను జరుపుకోవడం చూస్తూనే ఉంటాం. కొన్ని దేశాల్లో డ్యాన్స్ ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్, కలర్స్, బ్యూటీ, ఫ్రూట్స్ ఫెస్టివల్స్ వంటివి జరుగుతుంటాయి. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఆయా దేశ సంప్రదాయాలను బట్టి జరుగుతుంటాయి. వీటిలో ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బుజ్జి బుజ్జి పిగ్ ఫెస్టివల్. పెరూలోని హువాచె పట్టణంలో అక్టోబర్ రెండవ శుక్రవారం ఈ పిగ్ ఫెస్టివల్ జరుగుతుంది. 
 
ఈ ఫెస్టివల్ రోజున స్థానికులు గినియా పందులకు రంగురంగుల బట్టలతో చక్కగా అలంకరిస్తారు. మహారాజులు, మహారాణుల వలె వాటిని ముస్తాబు చేస్తారు. ఆ ఫెస్ట్‌లో పాల్గొనే వారందరూ తమ పంది పిల్లలకు నచ్చిన గెటప్‌లు వేస్తారు. ఫోటోలు తీసుకుంటారు. చూడముచ్చటగా ఉండే ఈ పందిపిల్లలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుకుంటారు. వాటితో సరదాగా గడుపుతారు. 
 
అయితే అలా ఆడుకున్న పంది పిల్లలను సాయంత్రం కాగానే చక్కగా వండుకుని లొట్టలేసుకుంటూ తినేస్తారు. హువాచె పట్టణంలో స్థానికులు ఎప్పటినుంచో ఈ పిగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. గినియా పందుల్లో ప్రోటీన్ అధికంగా ఉండి కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి ప్రజలు గినియా పందుల మాంసాన్ని ఎక్కువగా తింటారు. కాగా పెరూలోని ప్రజలు ఏటా 7 కోట్ల గినియా పందుల మాంసాన్ని తింటుండడం విశేషం.