శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (15:20 IST)

అది చైనా హెల్త్ ఆర్గనైజేషన్ ... 10 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ ఆరోగ్య సంస్థపై జపాన్ తీవ్ర సంచలన ఆరోపణలు చేసింది. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కాదనీ, దాని పేరును చైనా హెల్త్ ఆర్గనైజేషన్‌గా మార్చుకోవాలని సూచన చేసింది. ఈ మేరకు జపాన్ ఉప ప్రధాని తారో అసో సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. డబ్ల్యూహెచ్‌వో తన పేరును చైనా హెల్త్‌ ఆర్గనైజేషన్‌గా మార్చుకోవాలని ఆరోపించారు. కరోనా మహమ్మారి ప్రమాదాన్ని అంచనా వేయటంలో డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రెయేసుస్‌ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. 
 
జపాన్‌ చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రసంగించిన ఆయన గెబ్రెయేసుస్‌ను పదవి నుంచి తొలగించేందుకు చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీలో పిటిషన్లు నడుస్తుందన్నదన్నారు. ఈ పిటిషన్‌పై కనీసం 5 లక్ష మంది సంతకాలు చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భావించాల్సి వస్తుందని, ఇప్పటికే దానిపై 7 లక్షల మంది సంతకాలు చేశారని తెలిపారు. 
 
సొంతంగా ఎలాంటి విచారణ జరుపకుండానే చైనాలో కరోనా వ్యాధిగ్రస్తులు, మృతుల గురించి ఆ దేశం చెప్పిన లెక్కలను ఎలా ధృవీకరిస్తుందని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తుండటంతో అమెరికా, యూరప్‌ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. 
 
ఒక్క ఐరోపాలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌-19 సోకిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 53 వేలు దాటింది. కరోనా మరణాళ్లో సగానికిపైగా ఇటలీ.. స్పెయిన్‌ దేశాల్లోనే నమోదయ్యాయి.  ఇప్పటివరకు వైరస్‌ నుంచి 2,10,000 మంది కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే అమెరికాలో వెయ్యి మంది బలయ్యారు. కరోనా కారణంగా కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.