1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (14:30 IST)

వాడు చచ్చాడా.. పీడ విరగడైంది : జహ్రాన్ హషీమ్ సోదరి

ఈస్టర్ సండే రోజున సృష్టించిన మానరణహోమానికి సూత్రధారిగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్‌ తనను తాను పేల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఈ నరహంతకుడు కొలంబోలోని షాంగ్రీలా హోటల్‌లో జరిగిన బాంబు దాడిలో స్వయంగా పాల్గొన్నారు. ఈ ఘటనలో జహ్రాన్ కూడా మరణించాడు. అయితే, ఈ ఘటనలో చనిపోయింది అతనేనా కాదా అన్నది సందేహాస్పందగా మారింది. 
 
ఈ నేపథ్యంలో జహ్రాన్ సోదరి మథానియా ఇంటికి శ్రీలంక సైనిక అధికారి ఒకరు వెళ్లారు. "మీ సోదరుడు జహ్రాన్ మృతదేహం అంపారా ఆసుపత్రిలో ఉంది. మీరు వచ్చి చూస్తే నిర్ధారణ చేసుకుంటాం" అని మథానియాను కోరారు. దాంతో మథానియా "మీరు ఫొటో చూపిస్తే చాలు. అతడో కాదు గుర్తుపడతాను" అని బదులిచ్చింది. 
 
అంతేకాకుండా, "రెండేళ్లుగా అతడితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఇస్లాం పేరు చెప్పి తప్పుడు మార్గంలో పయనించాడు. ఖురాన్ చదివినవాడు మంచి మార్గంలో వెళ్లడానికి బదులు అమాయకుల్ని బలితీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు చచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జహ్రాన్ 6వ తరగతితో చదువు ఆపేసి ఇస్లామిక్ భావజాలంపై శ్రద్ధ పెట్టాడు. ఇస్లాం మీద ప్రసంగాలు అంటూ విషం చిమ్మేవాడు. ఇప్పుడీ పేలుళ్లలో చచ్చిపోయాడని తెలిసి నిజంగా ఆనందిస్తున్నాను" అంటూ తన హర్షం వ్యక్తం చేసింది.