శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (13:09 IST)

గగనతలంలోని విమానంలో కొట్లాట... ఒకరికి కాలు విరిగింది కూడా..

సాధారణంగా ఆర్టీసీ బస్సులు, రైళ్ళలో సీట్ల కోసం కొట్లాడుకోవడం చూస్తుంటాం. కానీ, గాల్లో ఎగిరే విమానంలో కూడా ఇదే తంతు జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు 320 మంది ప్రయాణికులతో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానమొకటి బయలుదేరింది. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకోవాల్సివుంది. విమానంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. 
 
దీంతో ప్రయాణికులంతా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ దాడిలో ఒక్కసారిగా విమానంలో హాహాకారాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో విమానాన్ని పైలట్ న్యూయార్క్‌లోని కెన్నడీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశాడు. 
 
కాగా, ఈ ఘర్షణలో 32 మందికి గాయాలు కాగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి కాలు విరిగింది. దీంతో అధికారులు వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 
 
ఈ ఘటనపై న్యూయార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికార ప్రతినిధి స్టీవ్‌ కోల్‌మన్‌ మాట్లాడుతూ.. ది బోయింగ్‌ 777 విమానం 326 ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో ఇస్తాంబుల్‌ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యే 45 నిమిషాల మందు విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
 
గొడవ పడుతున్న వారిని చూసి మిగతా ప్రయాణికులు కూడా ఆందోళన చెందారు. మొత్తం 32 మంది గాయపడగా.. వారిలో కొందరిని అధికారులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన వల్ల ఇతర విమానాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు. కాగా, ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలు విరిగినట్టు సమాచారం. గాయపడినవారిలో ఓ చిన్నారి కూడా ఉంది.