శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (17:19 IST)

బాల్యంలో రామాయణం, మహాభారతం కథలను విన్నాను: బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తాను అధికారంలో ఉన్న కాలంలో భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. తాజాగా తన పుస్తకం 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' లోనూ ఒబామా భారత్‌తో తనకు ఉన్న పరోక్ష అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒబామా రాసిన 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. దీంతో ఈ పుస్తకం ఆవిష్కరణకు ముందే ఎంతో ఆదరణ దక్కించుకుంది. 
 
ఈ పుస్తకంలో ఉన్న మరో విషయం భారతీయులకు ఆసక్తికరంగా మారింది. బరాక్ ఒబామా తాను బాల్యంలో భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం విన్నట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకం నవంబర్‌ 17న విడుదల కానుంది.
 
తాను బాల్యంలో ఇండోనేషియాలో ఉంటున్న సమయంలో రామాయణం, మహాభారతంలోని కథలను విన్నానని తెలిపారు. ఫలితంగా తనకు భారత్‌పై ప్రత్యేక గౌరవం ఏర్పడిందని పేర్కొన్నారు. మరోవైపు ఒబామా భారతదేశ గొప్పదనాన్ని తన మాటల్లో అభివర్ణించారు. భారత దేశ భౌగోళిక ఆకారం తనను ఎంతగానో ఆకర్షించిందని, ప్రపంచ జనాభాలో అత్యధికులు భారత్‌లో ఉంటారని. అలాగే విభిన్న జనజాతుల సముదాయం ఉంటుందన్నారు. 
 
భారత్‌లో 700కు మించిన భాషలున్నాయని ఒబామా తెలిపారు. తాను ఇండోనేషియాలో చదువుకుంటున్న రోజుల్లో పాకిస్తాన్, భారతదేశానికి చెందిన స్నేహితులు ఉండేవారన్నారు. అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు కూడా చూశానని తెలిపారు. అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అసాధారణ విజ్ఞానం కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అని ఒబామా ప్రశసించారు.
 
"1990లలో ఇండియాకు ఆర్థికమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిని తనకు ఏడుపదుల వయస్సులో ఉన్నప్పుడు కలిశాను. ఆయన సున్నితంగా మాట్లాడే ఆర్థికవేత్త. తెల్లటి గడ్డం, తలపాగాతో కనిపించారు. అతను ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఆ దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి కృషి చేశాడు. మన్మోహన్‌ సింగ్‌ తెలివైన వాడు దాంతో పాటు నిజాయతీపరుడు'' అని ఒబామా పుస్తకంలో తెలిపారు.