గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

శ్రీలంకను వేధిస్తున్న ఇంధన కొరత - మూతపడుతున్న విమానాశ్రయాలు

srilankan airlines
పొరుగున ఉన్న శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అలాగే ఆహార పదార్థాలు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా, ఇంధన కొరత కారణంగా అన్ని రకాల సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాజాగా విమాన సేవలను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అదేసమయంలో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాల నుంచి అప్పులు అడుగుతోంది. ఈ ఆర్థిక సమస్య కారణంగా ప్రజలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంకలో, వైద్యం, భద్రత వంటి అత్యవసర అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ప్రాతిపదికన ఇంధనం అందించబడుతుంది. దీంతో ఇతర ప్రైవేటు వాహనాల సేవలకు అంతరాయం కలిగినా, ప్రజలు స్థానిక బస్సు, రైలు సేవలను వినియోగించుకుంటున్నారు.
 
ఇపుడు ఇంధన కొరత కారణంగా అక్కడి విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచివుంది. దీంతో త్వరలో అక్కడి విమానాశ్రయాలన్నీ మూతపడే అవకాశం ఉందని సమాచారం. దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో కూడా ఇంధన నిల్వలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. 
 
ఈ కంపెనీ కాకుండా, మరికొన్ని ప్రధాన విమానయాన సంస్థలు కూడా ఇంధన నిల్వలతో తక్కువగా నడుస్తున్నాయి. ఫలితంగా విమాన ఇంధనం కొరత కారణంగా శ్రీలంకలోని అన్ని విమానాశ్రయాలు మూతపడే ప్రమాదం ఉంది. శ్రీలంకలో 22 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలుగా, మిగిలినవి దేశీయ విమానాశ్రయాలుగా పనిచేస్తున్నాయి.