1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

హెచ్1బి వీసాలపై నిషేధం పొడగింపు : డోనాల్డ్ ట్రంప్

వ‌ల‌స కార్మికుల‌పై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ పొడిగించారు. అమెరికాలో వ‌ర్క్ వీసాల‌పై ఉన్న తాత్కాలికంగా నిషేధాన్ని మార్చి 31 వ‌ర‌కు పొడిగిస్తూ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దేశంలోకి ఇమ్మిగ్రాంట్ల‌ను నిలువ‌రించేందుకు ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 
 
నిజానికి గ‌త ఏడాది ఏప్రిల్‌, జూన్ నెల‌ల్లో ఇమ్మిగ్రాంట్ల‌పై నిషేధం విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆ ఆదేశాలు అమ‌లులో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు ట్రంప్ పొడిగించారు. వ‌ల‌స కార్మికుల‌పై బ్యాన్ వ‌ల్ల‌.. గ్రీన్ కార్డు ద‌ర‌ఖాస్తుదారుల్ని ఆపేస్తారు. 
 
తాత్కాలిక విదేశీ వ‌ర్క‌ర్ల‌ను కూడా దేశంలోకి ఎంట్రీ కానివ్వ‌రు. క‌రోనా మ‌హ‌మ్మారితో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్థిరీక‌రించేందుకు ఇమ్మిగ్రేష‌న్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు గ‌తంలో ట్రంప్ తెలిపారు.  నిషేధానికి గురైన‌వారిలో హెచ్‌1-బీ వీసాదారులు, వ‌ర్క్ వీసాదారులు, గ్రీన్ కార్డు హోల్డ‌ర్లు ఉన్నారు. 
 
కాగా, అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డోనాల్డ్ ప్రకటించారు. 2020 డిసెంబర్ 31 వరకు అన్ని రకాల వర్క్ వీసాలపై నిషేధం విధిస్తూ అదే ఏడాది ఏప్రిల్ 22, జూన్ 22న ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఆ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.
 
అమెరికా కార్మిక విపణిపై కరోనా కోలుకోలేని దెబ్బకొట్టిందని, ప్రస్తుతం దాని ప్రభావాలు ఇంకా పోలేదని ట్రంప్ అన్నారు. మహమ్మారి ఇంకా లక్షలాది మంది పొట్టకొడుతోందని అన్నారు. ఏప్రిల్‌లో భారీగా ఉన్న నిరుద్యోగిత రేటు నవంబర్ నాటికి 6.7 శాతానికి తగ్గిందని చెప్పిన ఆయన.. 98.34 లక్షల మందిని మాత్రమే వ్యవసాయేతర ఉద్యోగాల్లో సర్దుబాటు చేశామని చెప్పారు. 
 
కాగా, జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్న జో బైడెన్.. ట్రంప్ నిర్ణయాన్ని ఖండించారు. అయితే, తానొచ్చాక ఆ ఆంక్షలను ఎత్తేస్తారా? లేదా? అన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో భారతీయులు, ఇండియన్ అమెరికన్ కంపెనీలపై ప్రభావం పడనుంది.