శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (10:50 IST)

మసాజ్ ఆశచూపి... లూటీ శారు... ఎక్కడ?

దుబాయ్‌లో ఓ భారతీయుడిని ఇద్దరు నైజీరియన్ మహిళలు లూటీ చేశారు. మసాజ్ ఆశ చూపి ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు మహిళలకు మరికొందరు పురుషులు కూడా తోడై.. భారత వ్యక్తి వద్ద ఉన్న క్రెడిట్ కార్డులతో పాటు 600 దిర్హమ్స్‌ను బెదిరించి దోచుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్న 40 యేళ్ల వ్యక్తికి ఓ డేటింగ్ యాప్ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ చాటింగ్ చేసుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో భారత వ్యక్తికి సదరు మహిళ మసాజ్ ఆశచూపించింది. 500 దిర్హమ్స్ ఇస్తే మసాజ్ చేస్తానంటూ తానుండే ఓ హోటల్ అడ్రస్ ఇచ్చింది. దీంతో భారత వ్యక్తి ఆమె చెప్పిన చోటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లింది. గదిలోకి వెళ్లిన వెంటనే మరికొందరు పురుషులు, మహిళలు వచ్చి భారతీయుడ్ని బంధించారు.
 
ఆ తర్వాత అతడి పర్సు లాక్కొని అందులో ఉన్న 600 దిర్హమ్స్‌తో పాటు రెండు క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. వాటి పాస్‌వర్డ్స్ తీసుకుని బయటకెళ్లి నగదు డ్రా చేసుకున్నారు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొదని బెదిరించి భారత వ్యక్తిని విడిచిపెట్టారు. 
 
ఈ ముఠా చెర నుంచి బయటపడిన భారతీయుడు నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు కేసు నమోదు చేసిన పోలీసులు... ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
బాధితుడు ఆ ఇద్దరు నిందితులను గుర్తుపట్టడంతో కటకటాల్లోకి నెట్టారు. ఇద్దరు నిందితులపై వేధింపులు, మోసం కేసు నమోదు చేశారు. ఈ ఘటన జూన్ 26న జరిగింది. సోమవారం ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 30న జరుగనుంది.