గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (10:03 IST)

ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం : లీజియన్ ఆఫ్ మెరిట్ పురస్కారం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవందక్కింది. వచ్చే నెలలో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక 'లీజియన్ ఆఫ్ మెరిట్' అవార్డును ప్రధాని మోడీకి ప్రకటించారు.
 
ఇండియా గ్లోబల్ పవర్‌గా ఎదుగుతోందని, అమెరికాతో ఆ దేశానికి వ్యూహాత్మక భాగస్వామ్యం మోడీ నేతృత్వంలో ఎంతో బలపడిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నరేంద్ర మోడీ తరపున అమెరికాలోని భారత దౌత్యాధికారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 
 
ఈ అవార్డును ప్రభుత్వ అధినేతలకు మాత్రమే ఇస్తామని ఈ సందర్భంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. యూఎస్ - ఇండియా సంబంధాలు మరింతగా బలపడటం వెనుక నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రపంచం ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకరిస్తున్నాయని తెలిపారు.
 
కాగా, నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డులను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారని, వైట్‌హౌస్‌లోనే ఆయా దేశాల ప్రతినిధులు అవార్డులను స్వీకరించారని ఓ బ్రెయిన్ మరో ట్వీట్‌లో తెలిపారు.