శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (14:33 IST)

చైనా తీరు అభ్యంతరకరం .. భారత్‌కు మా మద్దతు : అమెరికా

పొరుగు దేశాలతో డ్రాగన్ కంట్రీ చైనా వ్యవహరిస్తున్న తీరుపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరును చాలా నిశితంగా పరిశీలిస్తుని పేర్కొంది. వివాదాల పరిష్కారానికి ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయని, శాంతియుత ధోరణిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా కోరుతోంది.  అయితే, పొరుగు దేశాలను బెదిరించి భయపెడుతూ ఆక్రమణలకు తెగబడుతున్న చైనా తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇండో, పసిఫిక్‌లో భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి తెలిపారు. ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడాన్ని స్వాగతిస్తున్నామంటూ వెల్లడించారు. పైగా, ఇండో పసిఫిక్ భద్రతలో భారత్ ది చాలా కీలకమైన పాత్ర అని తెలిపింది. 
 
"భారత్-అమెరికాలది అత్యంత విశాలమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం. అన్ని విధాలా రెండు దేశాల మధ్య సహకారం, బంధం మరింత బలపడేందుకు కృషి చేస్తాం. ఈ బలమైన బంధం మున్ముందూ కొనసాగుతుందని ఆశిస్తున్నాం" అని నెడ్ ప్రైస్ చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో మిత్ర దేశాలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. అదేవిధంగా భారత్ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రతిష్టంభనకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది.