1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (10:26 IST)

ఐపీఎల్ 2022: బెంగుళూరు గోవింద గోవిందా

AB de Villiers_Virat Kohli
కనక వర్షం కురిపించే ఐపీఎల్ 2022లో భాగంగా.. ఆర్సీబీకి చుక్కలు కనిపించాయి. క్వాలిఫయర్‌-2లో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జయభేరి మోగించింది. 
 
తొలి క్వాలిఫయర్‌లో సునాయాస విజయంతో గుజరాత్‌ తుదిపోరుకు చేరగా.. అందులో ఓటమి పాలైన రాజస్థాన్‌ క్వాలిఫయర్‌-2లో విజృంభించింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరును కట్టడి చేసిన రాజస్థాన్‌.. ఆనక జోస్‌ బట్లర్‌ మెరుపు సెంచరీతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్నిఛేదించింది. 
 
ఈసారైనా కప్పు కొడతారనుకున్న బెంగళూరు అభిమానులకు నిరాశ తప్పకపోగా.. ఆదివారం జరుగనున్న ఫైనల్‌ ఫైట్‌లో గుజరాత్‌తో రాజస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనుంది.
 
ఫలితంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌ చేరకుండానే ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించింది. అదృష్టం కొద్ది ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకున్న బెంగళూరు.. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైంది. 
 
తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (7) మరోసారి నిరాశ పరచగా.. గత మ్యాచ్‌ సెంచరీ హీరో రజత్‌ పాటీదార్‌ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్‌ (25), మ్యాక్స్‌వెల్‌ (24) ఫర్వాలేదనిపించారు.
 
రాజస్థాన్‌ బౌలర్లలోమెక్‌కాయ్‌, ప్రసిద్ధ్‌ కృష చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు చేసింది. బట్లర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. 10పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా పదోసారి. 2012 ఐపీఎల్‌ నుంచి ఈ పరంపర కొనసాగుతుంది.