బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (18:29 IST)

రిలయన్స్ జియో చేతికి టిక్ టాక్ : బైట్‌డ్యాన్స్ నిర్ణయం!?

ఇండోచైనా సరిహద్దుల ఘర్షణలు చివరకు చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్ టాక్ మెడకు చుట్టుకున్నాయి. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని చైనాకు చెందిన వందకు పైగా యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. ఇదే బాటలో అగ్రరాజ్యం అమెరికా కూడా నడించింది. దీంతో టిక్ టాక్ భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది. ఈ క్రమంలో టిక్ టాక్‌ను కొనుగోలు చేసేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నారు. ఇలాంటి వాటిలో ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌లు ఉన్నాయి. ఇపుడు భారత్‌కు చెందిన మొబైల్ దిగ్గజం రిలయన్స్ జియో పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై ఆసంస్థ అధినేత ముఖేశ్ అంబానీ చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. 
 
ఒకవైపు అమెరికా వైఖరి టిక్‌టాక్‌కు తీవ్ర కష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో భారత వ్యాపారాలపై దృష్టిపెట్టింది. భారత్‌లో తన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌‌ వ్యాపారాన్ని రిలయన్స్ జియోకి కట్టబెట్టేందుకు సదరు చైనా కంపెనీ సిద్ధమైనట్టు సమాచారం. దేశంలో తన కార్యకలాపాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోనే బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ అంతర్గత వర్గాలు చెప్పినట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది. 
 
'గత నెలాఖరులోనే ఇరు కంపెనీలు ఈ దిశగా చర్చలు ప్రారంభించాయి. అయితే ఒప్పందంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు' అని పేర్కొంది. అయితే దీనిపై బైట్‌డ్యాన్స్, రిలయన్స్ జియో ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. దేశంలో టిక్‌టాక్ వ్యాపారం 3 బిలియన్ డాలర్లకు‌పైనే ఉంటుందని అంచనా. 
 
దేశంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం, భవిష్యత్తు కార్యకలాపాలపై సందిగ్ధత నెలకొనడంతో కంపెనీ ఉద్యోగులు వేరే అవకాశాలపై దృష్టిపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్-జియో ఒప్పందంపై ఊహాగానాలు వస్తుండటం గమానార్హం. ప్రస్తుతం దేశంలో 2 వేలకు పైగా ఉద్యోగులు టిక్‌టాక్‌లో పనిచేస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లోకి ఎవరినీ తీసుకోవడం లేదు.