శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (14:56 IST)

డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్- ఫేస్‌బుక్?

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనమంతా స్తంభించిన తరుణంలో ఆర్థిక కార్యాకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాలు బయటపెడితే కరోనా ఏ పక్క నుంచి కాటేస్తుందోనని ప్రతి ఒక్కరూ బయపడుతున్నారు. 
 
ఓ వైపు కరోనా మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు తమ రోజూవారి కార్యాకలపాలను కొనసాగించేందుకు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. కేవలం భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం తీసుకుంది.
 
కరోనా నేపథ్యంలో ఇప్పటికే వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చిన ఫేస్‌బుక్ సంస్థ.. దానిని ఈ ఏడాది (2020) చివరి వరకు పొడిగించడానికి ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ కూడా ఇదే బాటలో పయనించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఉద్యోగుల అందరికీ వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇస్తారా లేక 50 శాతం ఉద్యోగులకు మాత్రమే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. 
 
ఇక దేశంలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబై, ఢిల్లీలోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పిరిస్థితుల్లో ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులతో పాటు ఆయా సంస్థల యాజమాన్యాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్‌ ఫ్రం హోం ఉత్తమం అని వైద్య అధికారులతో పాటు ప్రముఖుల సైతం భావిస్తున్నారు.