1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:54 IST)

మూడేళ్లలో 10వేల మందికి అంతర్జాతీయ ఐటీ సంస్థ మౌరి టెక్‌ ఉద్యోగాలు

అంతర్జాతీయ ఎంటర్‌ప్రైజ్‌ ఐటీ పరిష్కారాల ప్రదాత, మౌరి టెక్‌, భారతదేశంలో ఉపాధి కల్పన పరంగా తమ వాగ్ధానానికి కట్టుబడుతూ తాము రాబోయే మూడు సంవత్సరాలలో 10 వేల మంది నూతన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. వీటిలో తొలి 2 వేల ఉద్యోగాలను 2021-2022 ఆర్ధిక సంవత్సరంలోనే నియమించుకోనుండగా, మొత్తమ్మీద హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలోనే 3000 మందికి పైగా ఉద్యోగులను తీసుకోనున్నారు.
 
దీర్ఘకాలంలో తమ వ్యాపారావకాశాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయనే అంచనాల నడుమ అదనపు సామర్థ్యపు అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో 3500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సర ఆరంభంతో పోలిస్తే 20% వృద్ధి కనిపించింది. ఈ కంపెనీ అవార్డులనందుకున్న ఏఐ పరిష్కారాలను తమ ప్రతిష్టాత్మక బ్రాండ్‌ ఔరాసూట్‌ డాట్‌ ఏఐ కింద అందిస్తుంది.
 
మౌరిటెక్‌, పలు పరిశ్రమల వ్యాప్తంగా బహుళ విభాగాలలో ఐటీ పరిష్కారాలను అందిస్తుంది. దీనిలో తమ వినియోగదారుల కోసం విస్తృతస్థాయి వినూత్నమైన ఉత్పత్తులు ఉన్నాయి. రోజూ వృద్ధి చెందుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ కంపెనీ, భవిష్యత్‌కు సిద్ధమైన సిబ్బందిని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు అనుభవజ్ఞులైన మిడ్‌, సీనియర్‌ స్థాయి ఐటీ ప్రొఫెషనల్స్‌‌తో పాటుగా తాజా గ్రాడ్యుయేట్లను కూడా క్యాంపస్‌ డ్రైవ్స్‌, జాబ్‌ మేళాలు, సామాజిక మాధ్యమాల ద్వారా నియమించుకోవాలని కోరుకుంటుంది. భారతదేశ వ్యాప్తంగా చేరికను దృష్టిలో పెట్టుకుని టియర్‌ 2 నగరాలలో కూడా ఈ నియామక ప్రక్రియ చేపట్టడానికి సంస్థ ప్రణాళిక చేసింది.
 
ఈ కంపెనీ తమ నూతన ఉద్యోగాలను డాటా సైన్సెస్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌, ఆటోమేషన్‌లో  సృష్టించనుంది. ‘‘కోవిడ్‌-19 అసాధారణ సవాళ్లను విసిరిన వేళ ఇది మనందరికీ అతి క్లిష్టమై కాలం. అదే సమయంలో మన నిబద్ధతను మెరుగుపరుచుకుని, పునరాకృతి కల్పించుకునే అవకాశం కూడా అందించింది.
 
మా వినియోగదారుల అవసరాలకు మెరుగ్గా మరియు సౌకర్యవంతంగా సేవలనందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. చిన్న నగరాలలో  అపారమైన ఐటీ ప్రతిభ ఉంది. దానిని పూర్తిగా అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కారణం చేతనే ఈ నగరాల నుంచి వేలాది నియామకాలను చేయాలనుకుంటున్నాం’’ అని మౌరిటెక్‌ గ్లోబల్‌ సీఈవో శ్రీ అనిల్‌ యర్రం రెడ్డి అన్నారు.