శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:57 IST)

సోషల్ మీడియాకు కేంద్రం ముకుతాడు... కొత్త మార్గదర్శకాలు

ఓటీటీ, డిజిటల్​ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. సోషల్​ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్​ కంప్లయిన్స్​ ఆఫీసర్​, నోడల్​ అధికారి, రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. 
 
"భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఓటీటీలు, డిజిటల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించేలా చూసేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చాం" అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ వెల్లడించారు. 
 
ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్​ మీడియాకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు. 
 
సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, తప్పుడు సమాచారం వ్యాప్తిపై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అందుకే కేంద్రం ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చిందని తెలిపారు. 
 
కొత్త నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు గ్రీవెన్స్ అధికారిని నియమించాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోగా నమోదు చేయాలి. మహిళల నగ్న, మార్ఫ్​డ్​ చిత్రాలు ఉన్న కంటెంట్​ను 24 గంటల్లోగా తొలగించాలి." అని వివరించారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. 
 
గ్రీవెన్స్​ అధికారి తప్పనిసరిగా భారత నివాసి అయి ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి సామాజిక మాధ్యమాన్ని అయినా భారత్​లో స్వాగతిస్తామని.. కానీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తే ఉపేక్షించేది లేదని రవిశంకర్​ ప్రసాద్​ హెచ్చరించారు.