1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మే 2021 (18:53 IST)

ప్రైవసీ పాలసీపై వాట్సాప్ మొండి పట్టు.. ఏడు రోజులు టైమిచ్చిన కేంద్రం

వాట్సాప్ ప్రైవసీ పాలసీపై వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రైవసీ పాలసీని వెనక్కు తీసుకోవాలని మరోసారి వాట్సాప్‌ను ఆదేశించింది. దీనిపై స్పందించేందుకు ఆ సంస్థకు ఏడు రోజులు గడువు ఇచ్చింది. ఈలోపు సరైన సమాధానం రాకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.
 
నిబంధనలకు సమ్మతి తెలిపే గడువును పొడిగించినంత మాత్రాన భారత కస్టమర్ల డేటా భద్రతకు హామీ లభించినట్టు కాదని ఐటీ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంతో భారత వినియోగదారులకు డేటా ప్రైవసీ, సెక్యూరిటీకి సంస్థ నుంచి ఎలాంటి హామీ వచ్చినట్లు భావించట్లేదని తెలిపింది. 
 
డేటా ప్రైవసీ విషయంలో భారతీయుల హక్కులను కాపాడాలని వాట్సాప్‌ను డిమాండ్ చేసింది. ఇతర దేశాల వినియోగదారులతో పోలిస్తే ఇండియన్ యూజర్లపై వాట్సాప్ వివక్ష చూపుతోందని ఐటీ శాఖ నోటీసులో పేర్కొంది.
 
చాలా మంది భారతీయ పౌరులు రోజువారీ జీవితంలో కమ్యూనికేషన్, ఇతర అవసరాలకు వాట్సాప్‌పై ఆధారపడతారు. అందువల్ల భారతీయ వినియోగదారులపై న్యాయబద్ధం కాని నియమ, నిబంధనలను, షరతులను విధించడానికి ఒప్పుకునేది లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. 
 
డేటా రక్షణ, భద్రత విలువలను ఈ పాలసీ బలహీనపరుస్తోందని తెలిపింది. భారత చట్టాలు వినియోగదారుల డేటాకు కల్పించే హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని ప్రభుత్వం చెబుతోంది.
 
కొత్త ప్రైవసీ పాలసీ భారతీయ చట్టాలు, నిబంధనలను అతిక్రమించేలా ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ముందు నుంచి వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మరోసారి వాట్సాప్‌కు నోటీసులు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొదటి నుంచి మొండిగా వ్యవహరిస్తున్న వాట్సాప్, తాజా నోటీసులకు ఎలా స్పందిస్తుందో చూడాలి.