శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (09:41 IST)

నేటి నుంచి జియో ఫైబర్ సేవలు ప్రారంభం

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జియో ఫైబర్ సేవలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ  సేవల్లో భాగంగా, డీటీహెచ్, కేబుల్‌ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో చర్యలు చేపట్టింది. ప్రతి బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌టాప్‌ బాక్స్‌ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. 
 
జియోఫైబర్‌ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్‌ బాక్స్‌ కూడా లభిస్తుంది. అలాగే, పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ మొబైల్‌ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు కూడా కలిపే బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ చార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్‌కు చెల్లించనక్కర్లేదు. ఇక సెట్‌టాప్‌కు కెమెరాను అమర్చుకుంటే టీవీ ద్వారా వీడియో కాలింగ్‌ సేవలు కూడా పొందవచ్చని సమాచారం.
 
ఈ సేవల్లో జియోఫైబర్‌ కస్టమర్లకు ల్యాండ్‌లైన్‌ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్‌ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్‌ నుంచి 1 గిగాబిట్‌ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందనున్నాయి. దీని చార్జీలు నెలకు రూ.700 నుంచి ప్రారంభమవుతాయి. వార్షిక ప్లాన్‌ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్‌డీ టీవీ సెట్‌ కూడా అందిస్తామంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ గతంలో వెల్లడించారు. 
 
మొత్తం మీద జియోఫైబర్‌ రాకతో చాలామటుకు డైరెక్ట్‌ టు హోమ్‌ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశమ్రవర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. జీ5, హుక్‌ వంటి పలు వీడియో స్ట్రీమింగ్‌ మొబైల్‌ యాప్స్‌ కంటెంట్‌ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా రూ.3,999కి సెట్‌ టాప్‌ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ.999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు.