1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (08:33 IST)

చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

konda vishweshwar reddy
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.4568.90 కోట్లుగా ప్రకటించారు. ఆయన పేరు మీద మాత్రమే రూ.1178.72 కోట్లు ఉన్నట్టు నామినేషన్ దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన వెల్లడించారు. 
 
తన పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తన భార్య సంగీతారెడ్డి పేరు మీద రూ.3,203.90 కోట్ల ఆస్తులను ప్రకటించారు. తన భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు ఉన్నారు.
 
మరోవైపు, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులు ఉన్నారు. సోమవారం పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ లోక్‌‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు.