1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (14:11 IST)

మహారాష్ట్రలో కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 10 మంది సజీవదహనం

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ కోవిడ్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. 
 
అహ్మద్‌నగర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. మంటల ధాటికి బయటకు రాలేక చిక్కుకుపోయిన కనీసం 10 మంది కరోనా పేషెంట్స్‌ సజీవదహనమయ్యారు.
 
అగ్నిప్రమాదంలో గాయపడిన మరో 11మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బందితో సహా వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
 
అటు, జమ్ముకశ్మీర్‌లో వరుస అగ్నిప్రమాదాలు..ఎస్‌. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. జమ్ముకశ్మీర్‌ కిష్త్వార్‌లో 3 అంతస్తుల భవనంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు ఆ భవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు.