1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (11:16 IST)

కేరళలో విజృంభిస్తున్న జికా వైరస్.. 28కి చేరిన కేసుల సంఖ్య

Zika
కేరళలో జికా వైరస్‌ విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం నాలుగు కేసులు నమోదవగా, తాజాగా మరో ఐదుగురిలో వైరస్‌ను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో జికా వైరస్‌ కేసుల సంఖ్య 28కి చేరింది. మరో ఐదుగురిలో జికా వైరస్‌ను గుర్తించామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. 
 
అందులో ఇద్దరు అనయారకు చెందినవారని, మరో ముగ్గురు కన్నకుఝి, పట్టొమ్‌, ఈస్ట్‌ ఫోర్టుకు చెందిన ముగ్గురు ఉన్నారని వెల్లడించారు. అనయారను జికా వైరస్‌ క్లస్టర్‌గా గుర్తించామని, అక్కడి నుంచి మరో ప్రాంతానికి వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనయారకు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో దోమలను నిర్మూలిస్తున్నామని తెలిపారు.
 
జికా వైరస్‌ ఏడెస్‌ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాదు. అయితే దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్‌ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.