1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (16:04 IST)

గుజరాత్‌లో కల్తీ మద్యానికి 21 మంది మృత్యువాత

deadbody
గుజరాత్‌ రాష్ట్రంలో పెను విషాదకర ఘటన ఒకటి జరిగింది. కల్తీ మద్యం సేవించి 21 మంది చనిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. రాష్ట్రంలోని బోతాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలో ఈ విషాదరక ఘటన జరిగింది. ఈ కల్తీ మద్యం సేవించిన వెంటనే అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించే మార్గంలో కొందరు, ఆస్పత్రిలో చేర్చిన తర్వాత, చికిత్స పొందుతు మరికొందరు ఇలా మొత్తం 20 మంది చనిపోయారు. అయితే, ఆస్పత్రిలో చేరిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ కల్తీ మద్యం ఘటనకు కారకులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 14 మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ప్రస్తుతం బోతాడ్, భావనగర్, అహ్మదాబాద్‌లలోని వేర్వేరు ఆసుపత్రుల్లో దాదాపు 21 మంది కల్తీ మద్యం బాధితులు చికిత్స పొందుతున్నారు. రోజిద్ గ్రామానికి చెందిన కొందరు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో కల్తీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఇద్దరు ఆసుపత్రిలో చేరిన కాసేపటికే మృతి చెందగా.. మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఎక్కువమంది దినసరి కూలీలే ఉన్నారు.
 
ఈ కల్తీ మద్యం ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటం వల్లే మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలోనూ లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.