శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (12:24 IST)

రక్తమోడిన కాన్పూర్ రోడ్లు - 2 గంటల్లో 2 ప్రమాదాలు - 31 మంది మృతి

road accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ రహదారులు రక్తమోడాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 31 మంది మృత్యువాతపడ్డారు. చంద్రిక దేవి ఆలయాన్ని దర్శించుకుని వస్తుంటగా పలువురు భక్తులతో కూడిన ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 20 మంది గాయపడ్డారు. అలాగే, మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వార్త తెలుసుకున్న ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ  సంతాపాన్ని తెలిపి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 
కాన్పూర్‌లో శనివారం రాత్రి ఈ రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 50 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ట్రాలీ ఘటంపూర్ ప్రాంత సమీపంలో అదుపుతప్పి ఓ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఉన్నావోలోని చంద్రిక దేవి ఆలయ సందర్శన అనంతరం భక్తులు వెనక్కి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందినప్పటికీ ఘటనా స్థలానికి పోలీసులను సకాలంలో పంపడంలో అలసత్వం వహించిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 
ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోపే మరో ఘటన జరిగింది. అహిర్వాన్ ఫ్లై ఓవర్ వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్ ముందు వెళ్తున్న టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ట్రాలీలను వ్యవసాయ పనుల కోసం ఉపయోగిస్తారని, ప్రయాణాలకు వాటిని వినియోగించవద్దని ఆయన కోరారు.