1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (14:09 IST)

మహా సంక్షోభం.. అంతకంతకూ పెరుగుతున్న ఏక్‌నాథ్ షిండే బలం

eknath sinde
మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని ప్రభుత్వం పతనం అంచున ఉంది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ పార్టీకే చెందిన సీనియర్, కీలక నేత ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ప్రకటించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బుధవారానికి 40 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంది. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనకు మద్దతునిచ్చే స్వతంత్రులతో కలుపుకుని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 46కు చేరింది. కొత్తగా మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా గౌహతికి చేరుకున్నారు. 
 
ఇదిలావుంటే, తమ పార్టీకే చెందిన శాసనసభ సభ్యులు తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాత్రే తన అధికారిక నివాసం వర్షను ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి చేరుకున్నారు. అయితే, శివసేన ఎమ్మెల్యేలు కోరితే తాను సీఎం పదవినే కాదు పార్టీ అధ్యక్ష పదవిని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
అంతేకాకుండా తాను బాల్‌ఠాక్రే కుమారుడునని, అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. హిందుత్వ అజెండాను శివసేన పార్టీ ఎన్నటికీ వీడిబోదని, తనపై తిరుగుబాటు చేసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికులే కూర్చొంటారని గ్యారెంటీ ఉందా అని ఆయన రెబెల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.