1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (19:47 IST)

పుల్వామాలో ఉగ్రదాడి.. ఏడుగురు పౌరులకు గాయాలు

పుల్వామా జిల్లాలో మరో ఉగ్రదాడి ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలో కీలకమైన పట్టణం త్రాల్‌లో ఆదివారం ఉగ్రవాదులు పట్టపగలే దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు అమాయక పౌరులు గాయపడ్డారు. 
 
పుల్వామా జిల్లాలోని త్రాల్ పట్టణంలో గల బస్టాండ్ వద్ద గస్తీ కాస్తోన్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని పేల్చేయాలనే లక్ష్యంతో ఉగ్రవాదులు దాడి జరిపారు. గ్రెనేడ్లను సీఆర్పీఎఫ్ వాహనంపైకి విసరగా, అవి గురి తప్పి పేలిపోయాయి. దీంతో అక్కడి మార్కెట్ లోని వీధి వ్యాపారులు, కొనుగోలుదారులు గాయపడ్డారు. 
 
టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడిలో గాయపడ్డ స్థానికులను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలించాయి. పేలుడు ఘటన తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్నీ స్వాధీనంలోకి తీసుకున్న బలగాలు.. ముష్కరుల కోసం కూంబింగ్ జరుపుతున్నాయి. గ్రెనేడ్ పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో స్థానికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 
 
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌ రాజౌరి జిల్లాలోని మన్యాల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు ఉగ్రవాద రహస్య స్థావరాన్ని పేల్చి వేశాయి. ఈ సందర్భంగా ఏకే-47 రైఫిల్‌తో సహా ఐదు తుపాకీలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.