1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (09:34 IST)

పాము కరిచింది.. కానీ బెదరలేదు.. ఆ ఏడేళ్ల బుడ్డోడు ఏం చేశాడంటే..?

పాము కరిచింది. అయినా బెదరలేదు. ఏడేళ్ల వయస్సులోనే ధైర్యంగా నిలిచాడు.. ఆ బాలుడు. చచ్చిన పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఈ పాము నన్ను కరిచింది అంటూ వైద్యులకు చూపించాడు. ఏమాత్రం అధైర్యపడకుండా చికిత్స చేయించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో జరిగింది. రాము కుమారుడు దర్షిత్‌ (7) మూడో తరగతి చదువుతున్నాడు. 
 
ఈ నెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని అవ్వ వద్దకు వెళ్లాడు. పొలంలో ఆడుకుంటున్న సమయంలో ఏదో కరిచినట్లుగా అనిపించింది. వెంటనే అదేంటో వెతికాడు.. పక్కనే రక్తపింజరి జాతి పాము కనిపించింది. కానీ, ఆ బుడ్డోడు ఏమాత్రం బయపడలేదు. 
 
పొలంలోకి పాకుతున్న పామును వెంటాడి పట్టుకున్నాడు. రాళ్లతో కొట్టి పామును చంపేశాడు. ఆ పామును చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చూపించాడు. అనంతరం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. విషపు పాము కరిచినా బాలుడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించారు. ఆ తర్వాత బాలుడి కాలు ఉన్నట్టుండి బాగా వాచిపోయింది.
 
ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం దర్షిత్ కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా బాలుడిని ఆస్పత్రి వైద్యులు పామును ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు.. అందుకు అతడు.. తనను ఏ పాము కరిచిందో తెలిస్తే కదా.. మీరు ట్రీట్ మెంట్ చేయగలిగేది అన్నారు. అంతే.. వైద్య బృందం అతడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.