శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (08:31 IST)

కొత్త రకం సైబర్‌ మోసాలు

పదో తరగతి కూడా పాసు కాని వారు.. పీజీలు చేసి ఉన్నత స్థాయిలో ఉన్న వారిని పేటీఎం క్యూఆర్‌ కోడ్‌తో తికమక పెట్టి బోల్తా కొట్టిస్తున్నారు. వస్తువును విక్రయించేందుకు ప్రకటనలు పెట్టిన వారి ఖాతాలనే సైబర్‌నేరగాళ్లు లూటీ చేస్తున్నారు.

ప్రతి రోజూ ఇలాంటి మోసాలకు గురవుతున్నవారు సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు తీస్తున్నారు.. నేను ఏమి చెప్పలేదు.. అయినా నా పేటీఎం ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయంటూ పోలీసుల ముందు లబోధిబోమంటున్నారు. క్రెడిట్‌ అంటూ ఉండడంతోనే నేను క్యూఆర్‌కోడ్ ను స్కాన్‌ చేశాను.

అయినా నా ఖాతాలో నుంచే డబ్బులు పోయాయి.. నేను చూసుకోకుండా స్కాన్‌ చేశాను.. డెబిట్‌ అని ఉండడంతో నేను స్కాన్‌ చేశాను.. ఇలా ఒక్కొక్కరు ఒకో రకమైన కారణాలను పోలీసులకు చెబుతున్నారు. 
 
మొన్నటి వరకు గూగుల్‌ పే అప్లికేషన్‌తో బోల్తా కొట్టిస్తూ రీసీవ్‌, యాక్సెప్ట్‌ అప్షన్లతో తికమక పెట్టించిన సైబర్‌నేరగాళ్లు.. ఇప్పుడు పేటీఎంపై పడ్డారు. కొన్ని సందర్భాలలో కేవలం ఫోన్లు చేసి.. మీ పేటీఎం ఖాతాకు బోనస్‌ వచ్చిందంటూ బోల్తా కొట్టిస్తున్నారు. కొన్ని డిజిటల్‌ అప్లికేషన్లలో రివార్డు పాయింట్లు ఉంటాయి.

వీటిని ఆసరగా చేసుకుంటున్న ఈ సైబర్‌ నేరగాళ్లు రివార్డుల పేరుతో అమాయకులను వేలు, లక్షల రూపాయలు బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాఫ్‌లకు క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తూ దానిని స్కానింగ్‌ చేయమం టూ రోజుకో కొత్త తరహా మోసానికి ఈ సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు.
 
కొన్ని ఘటనలు..!
ఖైరతాబాద్‌కు చెందిన నాగరాజుకు జహీరాబాద్‌ నుంచి పప్పు అనే వ్యక్తిని మాట్లాడుతున్నానంటూ ఫోన్‌ చేసి, మీకు ఓ క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తున్నాను.. రివార్డు పాయింట్లకు సంబంధించిన మీరు కోడ్‌స్కాన్‌ చేస్తే డబ్బులు మీ ఖాతాలోకి వచ్చేస్తాయంటూ నమ్మించి రూ. 72926 నాలుగు దఫాలుగా కాజేశాడు.
 
లక్ష్మీనగర్‌కు చెందిన రహమాన్‌ అనే ఓ డాక్టర్‌కు రాజీవ్‌ రంజన్‌ అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ పేటీఎంకు రూ. 10వేలు పంపిస్తున్నాం. మీరు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండంటూ వాట్సాఫ్‌కు కోడ్‌ను పంపించాడు. దాన్ని తన ఫోన్‌లో ఉన్న పేటీఎం యాప్‌లోనిఆప్షన్‌తో స్కాన్‌ చేయడంతో రూ.10 వేలు రహమాన్‌ ఖాతాలో నుంచి డెబిట్‌ అయ్యాయి.

ఇలా పలుదఫాలుగా క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేయమని సూచించడంతో వెంటనే అతని ఖాతాలో నుంచి రూ. 80 వేలు పేటీఎం ఖాతాలో నుంచి సైబర్‌ నేరగాడు ఖాళీ చేశారు.
 
డీడీ కాలనీలో నివాసముండే ప్రమోద్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. ఓఎల్‌ఎక్స్‌లో తన ఇంట్లో ఉన్న పాత డైనింగ్‌ టెబుల్‌ను రూ. 4వేలకు విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన ఓ వ్యక్తి తాను ఆర్మీలో పనిచేస్తానని, తాను పేటీఎం నెంబర్‌కు కొరియర్‌ ఛార్జీలతో కలిపి మొత్తం రూ. 4995 పంపిస్తానంటూ సూచించాడు.

తాను పంపించే క్యూఆర్‌ కోఢ్‌ యాప్‌లో స్కాన్‌ చేస్తే డబ్బులు మీకు వచ్చేస్తాయంటూ నమ్మించాడు. క్యూఆర్‌ కోఢ్‌ స్కాన్‌ చేయండంటూ సూచించడ ఆ డబ్బును ప్రమోద్‌ ఖాతా నుంచి కాజేశారు.. తరువాత తిరిగి పంపిస్తామంటూ నమ్మిస్తూ మూడు దఫాలుగా మొత్తం రూ. 49988 ఖాతాలో నుంచి కొట్టేశారు.
 
బోల్తా కొట్టించేస్తున్నారు.. జాగ్రత్త: సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ, కేవీఎం ప్రసాద్‌
ఓఎల్‌ఎక్స్‌లో వస్తువు విక్రయించే వాళ్లు .. కొనుగోలు చేసే వారిద్దరిని సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్మీ పేరుతో నమ్మించి..క్యూఆర్‌ కోడ్‌లో పం పించి పేటీఎం ఖాతాలో ఖాళీ చేస్తున్నా రు. ఇలాంటి సైబర్‌నేరగాళ్ల మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్‌ పంపించి, ఆ ఖాతాలో డబ్బు జమచేయమని చెప్పడం మంచిది.

డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ పై పూర్తిస్థాయి అవగాహన లేనప్పుడు కేవలం బ్యాంకు ఖాతాను మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం. అయితే డెబిట్‌ కార్డు నంబర్లు, సీవీవీ నంబ ర్లు, ఓటీపీలతో పాటు యూపీఐ పిన్‌ నంబర్లను కూడా ఎవరితో పంచుకోవద్దు.

ఎవరైనా లింకులు పంపించి, వాటిలో ఈ వివరా లు నింపమన్నా.. ఆ వివరాలు ఇవ్వవద్దు. సైబర్‌ఛీటర్లు మాటల్లో పెట్టి మోసాలు చేస్తుంటారు.. అంతగా చదువు లేని వాళ్లు చదువుకున్న వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు.అప్రమత్తంగా ఉండడంతోనే సైబర్‌నేరగాళ్లకు చెక్‌ పడుతుంది.