1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (09:24 IST)

భర్తంటే ఇష్టంలేదు.. ప్రియుడే ముద్దు... సహజీవనంకు రక్షణివ్వండి.. కోర్టుకు మహిళ

ఓ మహిళ కట్టుకున్న భర్తతో కాపురం చేసేందుకు ఏమాత్రం ఇష్టం చూపించలేదు. పైగా, తన ప్రియుడితో కలిసి సహజీవనం చేసేందుకు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె కోర్టుకు ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత భర్తను వదిలివేసి.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ వస్తోంది. అయితే, సహజీవనం చేస్తున్న తమపై కుటుంబ సభయులు దాడిచేయకుండా రక్షించాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. 
 
తమ సహజీవనం ప్రశాంతంగా సాగుతోందని, తమ జీవితంలో భర్త గానీ, ఇతరులు కానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని ఓ వివాహిత, ఆమె ప్రియుడు కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు.. వివాహిత మరో వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది. పైగా, పిటిషనర్‌కు రూ.5 వేల జరిమానా విధించింది. 
 
రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ చట్టానికి లోబడి ఉండాలని జస్టిస్ కౌశల్ జయేంద్ర ఠాకెర్, జస్టిస్ దినేశ్ పాఠక్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చట్టవ్యతిరేకాన్ని పోత్సహించే ఇలాంటి పిటిషన్‌లను అంగీకరించలేమని తేల్చి చెప్పింది. 
 
భర్త నుంచి ఇబ్బందులు కనుక ఎదుర్కొంటే తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్న కోర్టు.. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ పేరుతో వివాహేతర సహజీవనానికి అంగీకరించబోమని తేల్చి చెప్పింది.