శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (15:47 IST)

అమిత్ షాకు కరోనా నెగెటివ్ - దేశంలో పెరిగిన కరోనా రికవరీ రేటు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కరోనా వైరస్ బారినుంచి కోలుకున్నట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ వెల్లడించారు. కరోనా చికిత్స పొందుతున్న అమిత్‌ షాకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ ఫలితం వచ్చినట్లు ఆయన ఓ ట్వీట్ చేశారు. వారం తర్వాత జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు ఎంపీ తెలిపారు. 
 
ఆగస్టు 2వ తేదీన జరిపిన కరోనా పరీక్షల్లో అమిత్‌ షాకు పాజిటివ్‌ ఫలితం వచ్చిన విషయం విదితమే. దీంతో వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఇక అమిత్‌ షాను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 
 
మరోవైపు, భారతదేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కరోనా రికవరీ శాతం 48.2 నుంచి 68.3కు పెరిగిందని, జూన్ 6 - ఆగస్టు 8 మధ్య రికవరీ రేటు 20 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం తెలియజేసింది. 
 
ఇదిలావుండగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7 లక్షల కరోనా నమూనాలను పరీక్షించామని, దీంతో మొత్తం 2,41,06,535 మందికి కరోనా పరీక్షలు చేశామని కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎక్కువ మొత్తంలో పరీక్షలు చేస్తుండబట్టే కేసులు భారీగా నమోదవుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాజిటివ్‌ వచ్చిన వారిని సకాలంలో గుర్తిస్తే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. 
 
ఐసోలేషన్, సమర్థవంతమైన చికిత్సపై దృష్టి సారించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటివరకు 2,156,756 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం 43,498 మంది మరణించారు. 1,481,825 మంది ఇప్పటివరకు వ్యాధి బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిసింది.