1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (18:16 IST)

తమిళనాడులో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గత రెండు వారాల్లో ముగ్గురు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
 
ఇటీవల కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలో శ్రీమతి అనే ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా తిరువళ్ళూరు జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ వచ్చిన 17 యేళ్ల సరళ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమచారం అందుకున్న మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఈ వరుస ఆత్మహత్య ఘటనలపై ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ స్పందించారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడాలనే ఆలోచనను విడనాడాలని ఆయన కోరారు. కష్టాలను విజయాలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.