1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (11:35 IST)

వెస్టిండీస్‌పై భారత్ అద్వితీయ విజయం

team india
కరేబియన్ దీవుల పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు అద్వితీయ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకుంది. 
 
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో వరుసగా 12 సిరీస్‌లు కైవసం చేసుకొని ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గతంలో టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌తో సమానంగా 11 వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచింది. దాయాది జట్టు జింబాబ్వేపై 1996 నుంచి 2021 వరకు వరుసగా 11 సిరీస్‌లు సొంతం చేసుకుంది. ఇప్పుడు టీమ్‌ఇండియా దాన్ని అధిగమించింది.
 
వరుసగా అత్యధిక ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన జట్ల వివరాలను పరిశీలిస్తే, భారత్‌ x వెస్టిండీస్‌ (12 సిరీస్‌లు) 2007 - 2022 వరకు, పాకిస్థాన్‌ x జింబాబ్వే (11 సిరీస్‌లు) 1996 - 2021 వరకు, పాకిస్థాన్ x వెస్టిండీస్‌ (10 సిరీస్‌లు) 1999 - 2022 వరకు,  దక్షిణాఫ్రికా x జింబాబ్వే (9 సిరీస్‌లు) 1995 - 2018 వరకు,  భారత్‌ x శ్రీలంక (9 సిరీస్‌లు) 2007 - 2021 వరకు ఉన్నాయి. 
 
ఇకపోతే, 300పై చిలుకు లక్ష్యాల్లో నమోదైన స్వల్ప వ్యక్తిగత అత్యధిక స్కోర్ల వివరాలను పరిశీలిస్తే, 64 నాటౌట్‌ అక్షర్‌ పటేల్‌ వెస్టిండీస్‌తో ఆడిన ఈ మ్యాచ్‌లోనే 312/8, 65 షోయబ్‌ మాలిక్‌ 2005లో టీమ్‌ఇండియాతో ఆడిన మ్యాచ్‌లో 319/7, 68 గౌతమ్‌ గంభీర్‌ 2008లో శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో 310/4 చొప్పున ఉన్నాయి.