1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 మే 2023 (19:52 IST)

కునో నేషనల్ పార్కులో మరో రెండు చిరుత పిల్లలు మృతి

cubs of cheetahs
భోపాల్. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో రెండు చిరుత పిల్లలు మృతి చెందాయి. గత మూడు రోజులుగా 3 చిరుత పిల్లలు మృతి చెందడంతో వాటి నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్చి 24న ఆడ చిరుత జ్వాలకి పుట్టిన 4 పిల్లల్లో ఇప్పుడు 3 పిల్లలు చనిపోగా మరో చిరుత పిల్ల పరిస్థితి కూడా విషమంగా ఉంది.
 
కునో నేషనల్ పార్క్ సిబ్బంది ఇచ్చిన వివరాల ప్రకారం, చిరుత జ్వాలాకు పగటిపూట అదనపు ఆహారం ఇవ్వబడింది. మధ్యాహ్నం పర్యవేక్షణ తర్వాత మూడు పిల్లల పరిస్థితి సాధారణంగా కనిపించలేదు. మే 23న, కునోలో ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. పగటిపూట విపరీతమైన వేడి గాలులు కొనసాగాయి. ఆ తర్వాత మూడు పిల్లల పరిస్థితి అసాధారణంగా మారిపోయింది. దాంతో మూడు పిల్లలకు చికిత్స ప్రారంభించారు. వాటిలో 2 పిల్లల పరిస్థితి మరీ విషమించడంతో వాటిని రక్షించలేకపోయారు. అదే సమయంలో, మరొక పిల్ల పరిస్థితి విషమంగానే వుంది. దానిని పాల్పూర్ ఆసుపత్రిలో వుంచి చికిత్స చేస్తున్నారు.
 
తల్లి చిరుత జ్వాల ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కునో యాజమాన్యం పేర్కొంది. చిరుత పిల్లలన్నీ కృశించి, తక్కువ బరువుతో బాగా డీహైడ్రేషన్‌తో ఉన్నాయి. గతంలో కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుతలు సాషా, ఉదయ్, దక్ష చనిపోయాయి. సాషా మృతికి కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుత దక్ష మృతికి పరస్పర ఘర్షణలో గాయాలే కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో 1 చిరుత పిల్లతో సహా 17 చిరుతలు ఉన్నాయి.