గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (12:39 IST)

గుజరాత్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్‌తో దాడి

arvind kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖోదల్ ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో వెనుక నుంచి ఓ వ్యక్తి వాటర్ బాటిల్‌ను ఆయనపైకి విసిరారు. అయితే, ఆప్ నేతలు మాత్రం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 
 
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆప్ ఫోకస్ పెట్టింది. ఇందులోభాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్నారు. 
 
శనివారం రాజ్‌కోట్‌లోని ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకలకు హాజరయ్యారు. వేదికపై ఉన్న కేజ్రీవాల్‌ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. అయితే, అది ఆయనను దాటుకుని వెళ్లి పడింది. కేజ్రీవాల్ వైపుగా దూసుకొస్తున్న వాటర్ బాటిల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్‌లో కేజ్రీవాల్ ఇస్తున్న హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించి ఉచితంగా నాణ్యమైన చికిత్స అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇది సంచలనంగా మారింది.