1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (20:19 IST)

కేరళ ప్లాస్మా థెరపీ పనిచేస్తోంది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఈ వైరస్‌ను తరిమికొట్టేందుకు టీకాలు కనుగొనే పనిలో వున్నారు.. వైద్యబృందాలు. వైరస్ బాధితులకు ఇప్పటిదాకా నిర్ధారిత చికిత్స అంటూ ఏమీ లేదు. అయితే, ప్లాస్లా థెరపీ విధానంతో చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా రోగులపై ఈ థెరపీ పని చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 
 
తమ రాష్ట్రంలోని కరోనా రోగులపై ప్లాస్మా థెరపీ ప్రయోగాలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మరో ఇద్దరు, ముగ్గురికి సరిపడా రక్తం, ప్లాస్మా సిద్దంగా వున్నాయని వైద్యాధికారులు తెలిపారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే పరిస్థితులలో వున్న రోగులకు ప్లాస్మా థెరపీ చేస్తామని వెల్లడించారు.
 
ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో నలుగురు రోగులపై ప్రయోగాలు నిర్వహించామన్నారు. వీరిలో ఇద్దరు కోలుకొని డిశ్చార్జి కావడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ట్రయల్స్‌ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయన్నారు. కానీ, ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమే అని, వైరస్‌కు పూర్తి చికిత్స కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ చికిత్స ద్వారా కనీసం పదిమంది కోలుకోగలిగితేనే ఉత్తమ ఫలితంగా గుర్తిస్తామని చెప్పారు. 
 
రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీబాడీలు ఇందులో ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీబాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారుచేస్తుంది. అవి వైరస్ కణాలకు అతుక్కున్న తర్వాత వైరస్ కణాలను తెల్లరక్తకణాలు గుర్తించి నాశనం చేస్తాయి. అందుకే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను తీసి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రోగులకు ఎక్కిస్తారు. దీన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
 
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆస్పెరిసిస్ విధానం ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. మిగతా రక్త కణాలు మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. ఒక దాత నుంచి 800 మి.లీ. వరకు ప్లాస్మా తీయవచ్చు. ఐతే ఒక్కో కరోనా రోగికి 200 మి.లీ. ప్లాస్మా అవసరం పడుతుంది. అలా ఒక్క వ్యక్తి ద్వారా నలుగురు కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు. మొట్టమొదటగా ఢిల్లీలో ప్రయోగాత్మకంగా చేసిన ప్లాస్మా థెరపీ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు మహారాష్ట్రలోనూ చేయనున్నారు.