గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (17:57 IST)

దశాబ్దకాలం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే..

election commission
దేశంలో మరోమారు ఎన్నికలు జరుగనున్నాయి. జమ్మూకాశ్మీర్‌తో పాటు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 
 
జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. మొత్తం 90 స్థానాలకుగాను సెప్టెంబరు 18వ తేదీ (24 స్థానాలకు), 25వ తేదీన (26 స్థానాలకు), అక్టోబరు ఒకటో తేదీ (40 స్థానాలకు) పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబరు నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 
 
జమ్మూకాశ్మీర్‌, హర్యానాలకు మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ ఇదే.. 
హర్యానాలో అక్టోబరు ఒకటో తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకుగాను అక్టోబరు ఒకటో తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబరు నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. 
 
జమ్మూకాశ్మీర్‌, హర్యానాలకు మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ ఇదే.. 
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం గత మూడు పర్యాయాలుగా కొనసాగుతోంది. అయితే, జమ్మూకాశ్మీర్‌లో భారీ స్థాయిలో బలగాలను మోహరించే అవకాశం ఉండటంతో వీటిని వేర్వేరుగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుకే జమ్మూకాశ్మీర్‌, హర్యానా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపింది. 
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను వినాయక చవితి, నవరాత్రి, దీపావళి వంటి పండగల తర్వాత నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలను సరైన సమయంలో వాటిని నిర్వహిస్తామని తెలిపింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఢిల్లీ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.