1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (16:12 IST)

పేరుకే ఆటో డ్రైవర్.. వామ్మో కోటి రూపాయల విల్లాలో వుంటున్నాడు..

బెంగళూరు ఆటో డ్రైవర్ రూ.1.6కోట్ల విలువ చేసే విల్లాను కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఓ ఆటో డ్రైవర్ కోటి విలువ చేసే విల్లాను ఎలా కొన్నాడబ్బా అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఐటీ శాఖ బహిర్గతం చేసింది. ఐటీ దాడుల్లో ఆటో డ్రైవర్ విల్లాలో వుంటున్న విషయం వెల్లడి అయ్యింది. 
 
ఇంకా అతని ఇంట జరిపిన సోదాల్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఒక విదేశీ మహిళకు బినామీగా పెద్దఎత్తున ఆస్తులుకూడబెట్టినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆటోడ్రైవరు సుబ్రమణి నివాసం వుంటున్నాడు. ఇతని విల్లాపై ఐటీ దాడులు జరిగాయి. ఒక విదేశీమహిళ డబ్బుతో ఆటోడ్రైవరు బంగ్లా కొనుగోలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. 
 
ఆటోడ్రైవరు సుబ్రమణి ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా సుబ్రమణి ఒక విదేశీ మహిళకు బినామీ అని తెలిసింది. ఇతనికి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధం వున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.
 
విదేశీ మహిళతో పరిచయం ఏర్పరుచుకున్న సుబ్రమణి, ఆమె భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయిస్తానని.. ఆమెను నమ్మించి ఆస్తులు కొనుగోలు చేయించి వుంటాడని ఐటీ అధికారులు భావిస్తున్నారు. సుబ్రమణి మాటలు నమ్మిన విదేశీ మహిళ అతడి పేరుతో ఆస్తి కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి బ్యాంక్‌ ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో సుబ్రమణి బంగ్లా కొనుగోలు చేశాడని వెల్లడైంది. ఐటీ అధికారులు సోదాల అనంతరం సుబ్రమణికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.