1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (08:54 IST)

మీర్జాపూర్‌లో ఏటీఎం సొమ్ము దోపిడీ.. సెక్యూరిటీ గార్డును చంపేసి...

atm cash theft
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో దారుణం జరిగింది. సెక్యూరిటీ గార్డును చంపేసి ఏటీఎం కేంద్రంలోని సొమ్మును దోచుకున్నారు. ఈ ఘటన పట్టపగలు జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. 
 
మీర్జాపూర్‌, కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉన్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యానులో వచ్చారు. వారు కిందికి దిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. 
 
హెల్మెట్లు ధరించి అప్పటిదాకా ఆ చుట్టుపక్కల తచ్చాడిన నలుగురు దుండగులు అమాంతం వారి మీద దాడి చేశారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపారు. మరో దుండగుడు వ్యాన్‌ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదు ఉన్న పెట్టెను హస్తగతం చేసుకున్నాడు. ఈ ముఠా రెండు బైకులపై పరారైంది. ఈ దోపిడీ మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది.