గురువారం, 24 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (20:05 IST)

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరు? 2025లో ఖరారు

Modi
Modi
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ఖరారు చేసేందుకు పార్టీ సంస్థాగత ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఖరారు చేసే అవకాశం వుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణ సహా పలు రాష్ట్ర శాఖల అధ్యక్షుల పదవీకాలాన్ని బీజేపీ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రకారం మార్పులు జరగనున్నాయి. 
 
బిజెపి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్‌ను ఆ పార్టీనియమించింది. ఎన్నికల ప్రక్రియ మొదట్లో బూత్ కమిటీల నుంచి ప్రారంభమై తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగుతుంది. 
 
కొత్త కమిటీల ఎన్నికల్లో క్రియాశీల పార్టీ సభ్యులు కీలక పాత్ర పోషించనున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలు 3 నెలల్లో పూర్తవుతాయి. 10 కోట్ల మంది బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారని లక్ష్మణ్ తెలిపారు. అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. 
 
బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రాథమిక సభ్యత్వం పూర్తయిన తర్వాత క్రియాశీల సభ్యత్వ ప్రక్రియ జరుగుతుంది. బూత్ కమిటీల ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 
 
దేశవ్యాప్తంగా 10 లక్షల బూత్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒక్కో బూత్ కమిటీలో అధ్యక్షుడితో సహా 11 మంది సభ్యులు ఉంటారు. సాధారణ కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన తనకు రిటర్నింగ్ అధికారిగా నియామకం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని లక్ష్మణ్ అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు సంబంధించి జాతీయ స్థాయి వర్క్ షాప్ పూర్తయిందని తెలిపారు.