1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (09:45 IST)

బ్లాక్ ఫంగస్‌ని ఎపిడకమిక్ యాక్ట్‌లో చేర్చిన కేంద్రం!

కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి పాలిట బ్లాక్ ఫంగస్ శాపంగా మారింది. ఈ ఫంగస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడ్డారు. దీంతో బ్లాక్ ఫంగస్‌ని కేంద్రం ఎపిడమిక్ యాక్ట్ 1897లో చేర్చింది. దీంతో ఆయా నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
బ్లాక్ ఫంగస్ కేసులను ప్రతిరోజు రిపోర్ట్ చేయాలని కూడా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని హాస్పిటల్స్‌కు ఆదేశాలిచ్చారు. ఇలావుండగా, దేశవ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు భారీ సంఖ్య‌లో వెలుగుచూస్తున్నాయి. 
 
అటు, ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు టెన్ష‌న్ పెడుతున్నాయి. పట్టణంలో ఆరు బ్లాక్‌ఫంగస్‌ కేసులు వెలుగుచూసిన‌ట్లు మార్కాపురం కొవిడ్ సెంట‌ర్ ఇన్‌ఛార్జి డాక్టర్ రాంబాబు ఇప్పటికే ప్రకటించారు. 
 
అనంతపురం జిల్లాలోనూ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. జిల్లా వాసుల్లో తాజాగా ఇద్దరికి బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)ను రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. అయితే వీరందరికీ చికిత్స అందించేందుకు ప్రభుత్వం జైపూర్‌లోని సవాయ్‌మన్ సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు.