1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (09:17 IST)

పనిమనిషిపై వేధింపులు... డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు - కోడలు పరారీ

crime
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకేకు చెందిన చెన్నై పల్లావరం ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు, కోడలు చిక్కుల్లో పడ్డారు. తమ ఇంట్లో పని చేసే పనిమనిషిని వేధించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు, కోడలిని విచారించేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్ళగా వారు ఇంటికి తాళం వేసి పారిపోయారు. పని మనిషిని చిత్ర హింసలకు గురిచేసినట్టు ఫిర్యాదు రావడంతో ఏకంగా ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వారు ఇంటికి తాళం వేసి పత్తా లేకుండా పారిపోయారు. వీరికోసం పోలీసులు మూడు బృందాలతో గాలిస్తున్నారు. 
 
చెన్నై పల్లావరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కరుణానిధి (డీఎంకే) ఉన్నారు. ఈయన కుమారుడు ఆండ్రో మదివన్నన్, కోడలు మెర్లినా. తమ ఇంట్లో పనిచేసే పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసినట్టు వారిద్దరిపై కేసు నమోదైంది. మదివన్నన్, మెర్లినా దంపతుల నివాసంలో ఓ యువతి పనిమనిషిగా చేరింది.
 
అయితే, ఆమెను ఎమ్మెల్యే కొడుకు, కోడలు దారుణంగా వేధించేవారని, ఇంటి పనులు చేస్తున్నప్పటికీ హింసించేవారని ఆరోపణలు వచ్చాయి. మూడేళ్లు తమ వద్దే పనిచేయాలని ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారని, పని మానేసి వెళ్లిపోతే ఆమె తల్లికి హాని తలపెడతామని బెదిరించేవారని వెల్లడైంది. అప్పుడప్పుడు శరీరంపై వాతలు పెట్టి, రక్తం వచ్చేలా కొట్టేవారని పోలీసులు పేర్కొన్నారు.
 
ఇటీవల ఎమ్మెల్యే కొడుకు, కోడలు తమతో పాటు ఆ యువతిని ముంబై తీసుకెళ్లారు. అక్కడ వంట సరిగా చేయలేదని ఆమెను చితకబాదారని, బలవంతంగా పచ్చి మిరపకాయ తినిపించారని పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్‌లో పేర్కొన్నారు. యువతిని వేధించినట్టు ఫిర్యాదు అందిన నేపథ్యంలో, నీలాంగరై మహిళా పోలీసులు ఎమ్మెల్యే కొడుకు మదివణన్, కోడలు మెర్లినాలపై 6 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. 
 
అయితే, ఆరు రోజుల కింద ఈ కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి మదివన్నన్, మెర్లినాలు ఇల్లు వదిలి పారిపోయారు. దాంతో వారి కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, ఎమ్మెల్యే కొడుకు, కోడలు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.