1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (14:11 IST)

కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు - 24 వేల టీచర్ పోస్టులు రద్దు!!

court
కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గత 2016లో నియమితులైన 24 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్ట విరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్లెను రద్దు చేసింది. ఆ టీచర్లంతా ఆరు వారాల్లోగా వారు పొందిన జీతాలను 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదేసమయంలో కేన్సర్‌తో బాధపడుతున్న సోమా దాస్ అనే వ్యక్తికి ఇచ్చిన వ్యక్తికి మాత్రం మినహాయింపునిచ్చిఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, కొత్త టీచర్ల నియామక ప్రక్రియను 15 రోజుల్లో చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ దెబాంగ్యు బాసక్, మొహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో గ్రూపు-సి, డీతో పాటు 9, 10, 11, 12 తరగతుల టీచర్లకు చెందిన సుమారు 24 వేల ఉద్యోగాలు రద్దు అయ్యాయి. 
 
హైకోర్టు ఇలా సంచలన తీర్పును వెలువరించడానికి అసలేం జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తే, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న 24,640 టీచర్ పోస్టుల భర్తీకి 2016లో రాష్ట్ర  స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించింది. అయితే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని.. అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు ఆందోళన చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశంతో హైకోర్టు విచారణ ప్రారంభించింది. కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
 
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ స్కాంలో పాత్ర ఉందంటూ 2022లో నాటి విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీతోపాటు బెంగాల్ స్కూల్ సర్వీసు కమిషన్‌లో పనిచేసిన కొందరు అధికారులను అరెస్టు చేసింది. పార్థా చటర్జీకి ప్రధాన అనుచరురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన కోల్‌కతా నివాసాన్ని సీబీఐ తనిఖీ చేయగా రూ.21 కోట్ల నగదు, రూ.కోటికిపైగా విలువ చేసే నగలు లభించాయి. ఈ కేసులో సీబీఐ తమ దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. సీబీఐ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని హైకోర్టు ఇపుడు సంచలన తీర్పును వెలువరించింది.