కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్
కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేనని కేపీసీసీ అధ్యక్షుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కర్నాటక పీసీసీ చీఫ్గా తానే శాశ్వతంగా ఉండలాని అనుకోవడం లేదని, కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే, రాష్ట్రంలో పార్టీని నడిపించే విషయంలో మాత్రం ముందుంటానని స్పష్టం చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 'కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేను. ఇప్పటికే ఐదున్నరేళ్లు అయ్యింది. మరికొద్ది నెలల్లో ఆరేళ్లు పూర్తవుతుంది. ఇతరులకూ అవకాశం ఇవ్వాలి. 2023 మే నెలలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అనుకున్నాను.
కానీ.. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ మరికొంత కాలం కొనసాగాలని కోరారు. కేపీసీసీ అధ్యక్ష పదవిలో నేను ఉన్నానా? లేదా? అనేది ముఖ్యం కాదు. పార్టీ నాయకత్వం విషయంలో ముందు వరుసలో ఉంటాను. నా పదవీకాలంలో 100 పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను' అని డీకే శివకుమార్ తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని డీకే ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఆశావహ దృక్పథంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.